భారత ఆర్మీలో.. శత్రువుల దాడిలో మరణించే వారికన్నా ఆత్మహత్య, భ్రాతృహత్యల కారణంగా మరణించే వారి సంఖ్యే ఎక్కువని యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో వెల్లడైంది. సైనికుల్లో మానసిక ఒత్తిడి తీవ్రతరమవుతోందని నివేదికలో స్పష్టం చేసింది.
"ఉగ్రవాదం, కౌంటర్ ఇన్సర్జెన్సీ మొదలైన విషయాలకు సంబంధించి ఆర్మీ బలగాల్లో ఒత్తిడి పెరుగుతోంది" అని యూఎస్ఐ సంస్థ సీనియర్ సభ్యుడు కర్నల్ ఏ కే మోర్ తెలిపారు.
మూడు రోజులకు ఓ సైనికుడు..
గత 20 ఏళ్ల నుంచి ఆర్మీ బలగాల్లో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతోందని యూఎస్ఐ పేర్కొంది. ప్రస్తుతం భారత ఆర్మీలో సగానికిపైగా సైనికులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించింది. దీనిని అదుపు చేసేందుకు గత 15 ఏళ్ల నుంచి భారత ఆర్మీ, రక్షణ శాఖ పలు చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితం రాలేదని నివేదికలో పేర్కొంది.
"భారత ఆర్మీ దళాలు ఆత్మహత్యల కారణంగా ఏటా 100 మందిని కోల్పోతున్నాయి. ప్రతి మూడు రోజులకోసారి ఒక సైనికుడు మృతి చెందుతున్నట్లు అంచనా" అని తెలిపింది యూఎస్ఐ. నాయకత్వ లోపం, అధిక భారం, వనరుల లోపం, ప్రాంతాల మార్పిడి, ప్రమోషన్-పోస్టింగ్ విషయాల్లో అస్పష్టత, సెలవులు దొరకకపోవడం మొదలైన విషయాల్లో ఆర్మీ బలగాలకు ఒత్తిడి పెరుగుతోందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:ఆరుగురు పాక్ చొరబాటుదారుల అరెస్ట్