అసోం, మిజోరం మధ్య ఉన్న 306వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు నిషేధం కొనసాగుతున్న వేళ.. మిజోరం ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగంపై ఆ రాష్ట్రం పరిమితులు విధించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అసోంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం నేపథ్యంలో.. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
"పరిమితులను దాటి పెట్రోల్, డీజిల్ను పెట్రోల్ బంకులు పంపిణీ చేయకూడదు. పెట్రోల్ బంకులకు వెళ్లిన వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ అందించాలి."
-మిజోరం ప్రభుత్వ ఆదేశాలు
ఉత్తర్వుల్లో ఇంకా ఏం చెప్పిందంటే..
- ఆరు, ఎనిమిది చక్రాలు ఉండే భారీ మోటార్ వాహనాలకు 50 లీటర్ల ఇంధనం, ట్రక్కుల వంటి మధ్య స్థాయి మోటార్ వాహనాలకు 10 లీటర్లు చమురును పొందేందుకు అనుమతి ఉంటుంది.
- ఎల్పీజీ, బియ్యం సంచులు, చమురు సరఫరా చేసే వాహనాలు.. తమ రాకపోకలకు సరిపడా ఇంధనాన్ని మాత్రమే తీసుకునేందుకు అవకాశం.
- పెట్రోల్ బంకుల్లో గ్యాలన్లు, కంటెయినర్లలో ఇంధనాన్ని నింపుకునేందుకు అనుమతి లేదు.
- తమ వద్ద నిల్వ ఉన్న ఇంధన వివరాలపై నివేదికను ప్రతిరోజు తూనికలు, కొలతలు శాఖకు పెట్రోల్ బంకులు సమర్పించాలి.
- పెట్రోల్ నిల్వలు 5,000 లీటర్లు, డీజిల్ నిల్వ 7,000 లీటర్లకు చేరితే.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా బంకులు.. వినియోగదారులకు పంపిణీ చేయకూడదు.
- సోమవారం నుంచి శనివారం మధ్య ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు తెరిచి ఉంచాలి.
కొనసాగుతున్న వివాదాలు..
మరోవైపు అసోం, మిజరోం సరిహద్దులో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా.. ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటామని అంగీకారం కుదుర్చుకున్న మరుసటి రోజున స్థానికులు రెచ్చిపోయారు. కచార్ జిల్లా భాగా బజార్లో కోడిగుడ్లతో మిజోరం వైపు వెళ్తున్న నాలుగు ట్రక్కులను శుక్రవారం సాయంత్రం ధ్వంసం చేశారు.
ఇవీ చూడండి: