కన్నడ రాజకీయాల్లో దుమారం రేపిన మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహోళి సీడీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో జర్ఖిహోళితో పాటు ఓ మహిళను ప్రశ్నించిన సిట్ అధికారులు.. మరో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్కు నోటీసులు పంపారు. సోమవారం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పుకొచ్చారు సుధాకర్.
"సీడీ కేసులో మహిళకు నేను డబ్బు బదిలీ చేయలేదు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్ అధికారుల విచారణలో ఇదే సమాధానం చెబుతాను. ఈ కేసులో మాజీ మంత్రి ఉన్నారని వదంతులు వచ్చాయి. అవసరమైతే కోర్టుకు వెళ్తాను. సీడీ కేసులో నా పేరు ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను."
- సుధాకర్, మాజీ మంత్రి
అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య, రమేశ్ జర్ఖిహోళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా అందరూ తనకు సన్నిహితులే అని చెప్పుకొచ్చారు సుధాకర్.
పోలీసులు పక్షపాతం చూపుతున్నారు: మహిళ
తన పట్ల పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని.. రమేశ్ జార్ఖిహోళితో పాటు అసభ్యకర వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరు పోలీసుల కమిషనర్కు కమల్ పంత్కు లేఖ రాసింది.
"నిందితుడిని ఒక్కసారి ప్రశ్నించిన అధికారులు.. నన్ను పలుమార్లు ప్రశ్నించారు. అది కూడా మూడు గంటలపాటు. మొత్తం ప్రక్రియను చూసిన తర్వాత, నేను బాధితురాలినా లేదా నిందితురాలినా? అనే సందేహం కలిగింది" అని లేఖలో పేర్కొంది. నిందితుడికి ఎటువంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు అధికారులు అవకాశం కల్పించారని.. అయితే తనను నిరంతరం ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది.
ఇవీ చూడండి: