Agnipath Recruitment Scheme: సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా భారత వాయుసేన అగ్నిపథ్ కింద నియామక వివరాలను విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది. అగ్నిపథ్పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు నియామక ప్రక్రియలను శరవేగంగా మొదలుపెట్టేస్తున్నాయి.
వాయుసేనలో అగ్నిపథ్ కింద చేరే అగ్ని వీరుల పర్యవేక్షణ మొత్తం 1950 ది ఎయిర్ఫోర్స్ యాక్ట్ కింద జరుగుతుంది. ఆన్లైన్ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా ఎంపికలు చేపడతారు. ప్రత్యేకమైన ర్యాలీలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎన్ఎస్క్యూఎఫ్లో గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాయుసేనలో ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నంగా వీరికి ప్రత్యేకమైన ర్యాంక్ కేటాయించనున్నట్లు వాయుసేన పేర్కొంది.


ఇక ఎంపికైన అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు అభ్యర్థులు ఉంటే.. వారి తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు కూడా పతకాలు, అవార్డులకు అర్హత లభిస్తుంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయి. దీంతోపాటు అనారోగ్యం ఆధారంగా సిక్లీవ్లు లభిస్తాయి.


Agnipath Protests: అగ్నిపథ్కు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పలు రాష్ట్రాల్లో సైనిక ఉద్యోగార్థులు విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. కొత్త సైనిక నియామక విధానాన్ని రద్దు చేయాల్సిందేనని నినదించారు. బిహార్లో శనివారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్కు ఆర్జేడీ, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. హరియాణా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, అసోంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడులలోనూ నిరసనలు పెల్లుబికాయి. కర్ణాటక, బంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
ఇదీ చదవండి: ఆరని నిరసనాగ్ని.. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోనూ ఆందోళనలు