Independence Day 2022: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. 76వ స్వాతంత్య్ర దినోత్సవానికి దిల్లీలోని ఎర్రకోట అంగరంగ వైభవంగా ముస్తాబైంది. చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వసారి జాతీయజెండా ఎగురవేయనున్నారు. ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ కూడా కరోనా కోరల నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్న వేళ జరుగుతున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలను కేంద్రప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.
![Independence Day 2022 PM Modi to address nation at Red Fort in Delhi prepares for Independence Day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16100938_independence-day-20223.jpg)
76వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపునకు ఆసేతు హిమాచలం స్పందించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నివర్గాల ప్రజలు మువ్వన్నెల జెండా చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి మేరా భారత్ మహాన్ అంటూ దేశభక్తిని చాటారు. ప్రతి ఏటా ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో అనేక కీలక అంశాలను హైలైట్ చేస్తుంటారు. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వివిధ వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను ప్రస్తావిస్తుంటారు.
![Independence Day 2022 PM Modi to address nation at Red Fort in Delhi prepares for Independence Day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16100938_independence-day-202267.jpg)
గతేడాది చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ.. ప్రధానంగా జాతీయ హైడ్రోజన్ మిషన్, గతిశక్తి మాస్టర్ ప్లాన్, 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈసారి 100 ఏళ్ల స్వాతంత్య్ర భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశముంది.
![Independence Day 2022 PM Modi to address nation at Red Fort in Delhi prepares for Independence Day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16100938_independence-day-20225643.jpg)
స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ చారిత్రక ఎర్రకోట చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులు, భద్రతా దళాలతో శత్రు దుర్భేద్యంగా మార్చారు. వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దించారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించి, నేలకూల్చేలా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. దిల్లీలో పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్ క్రాప్ట్లపై ఆగస్టు 16 వరకు నిషేధం విధించారు.
![Independence Day 2022 PM Modi to address nation at Red Fort in Delhi prepares for Independence Day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16100938_independence-day-2022.jpg)
![Independence Day 2022 PM Modi to address nation at Red Fort in Delhi prepares for Independence Day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16100938_independence-day-20221.jpg)
ఇవీ చూడండి: పంద్రాగస్టు ముహూర్తంపై మౌంట్బాటెన్ చెప్పిన అసలు కారణం ఇదే