ముంబయిలోని జేజే ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓ కొవిడ్ రోగికి తెగిన చేతిని విజయవంతంగా అతికించారు. వైద్యుల కృషి ఫలితంగా ఆ వ్యక్తి ఇప్పుడు కొత్త జీవితం లభించింది. డాక్టర్ చంద్రకాంత్ ఘార్వాడే, డాక్టర్ యోగేశ్ జైశ్వాల్ ఈ సర్జరీని పూర్తి చేశారు.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి.. ముంబయిలోని బైకుల్లా రైల్వే స్టేషన్ వద్ద మార్చి 16న ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతని చేయి తెగిపోయింది. దాంతో అతణ్ని జేజే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్య నిపుణులు.. 11 గంటలపాటు శ్రమించి అతడికి సర్జరీ చేశారు. చేతి నరాలను, కండరాలను, చర్మాన్ని విజయవంతంగా అతికించారు.
ఆ గాయాల నుంచి అజిత్ కుమార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన చేతిని, తన జీవితాన్ని కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పేందుకు అతడి వద్ద మాటలు కరవయ్యాయి.
సర్జరీ ఎలా జరిగింది? డాక్టర్లేమన్నారు...?
అజిత్ కుమార్ను తమ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు.. డీన్ మంకేశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ సూరారే.. జీటీ ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారని డాక్టర్ చంద్రకాంత్ ఘార్వాడే తెలిపారు. అక్కడ అతనికి యాంటీజెన్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్గా తేలిందని చెప్పారు.
"శరీరంలో నుంచి ఏ అవయవమైనా విడిపోయిన తర్వాత మొదటి ఆరు గంటలు అత్యంత కీలకం. దాన్ని గోల్డెన్ అవర్ అని చెప్పవచ్చు. అజిత్ కుమార్ చేతిలో తెగిన నరాలను అతికించడానికి వీలుగా కాలు నుంచి ఓ నరాన్ని తీసుకున్నాం. దానికి ఆరు గంటలు పట్టింది. అప్పుడు కండరాలను జతచేశాం. కడుపు చర్మం నుంచి కొంత భాగాన్ని తీసుకుని, చేతి మీద చర్మంలా అతికించాం. ఈ సర్జరీ చేయడానికి మొత్తం 11 గంటలు పట్టింది. సర్జరీ పూర్తైన తర్వాత గంటకోసారి అతణ్ని పరీక్షిస్తూ వచ్చాం.
ఈ క్రమంలో అతడి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అప్పుడు.. ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. దాంతో కొవిడ్ చికిత్స నిమిత్తం అతడ్ని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించాం. జేజే ఆసుపత్రి వైద్య బృందం.. ప్రతిరోజు అతణ్ని పరీక్షించేందుకు, డ్రెస్సింగ్ చేసేందుకు ఆ ఆసుపత్రికి వెళ్లేది. అజిత్ కుమార్ను మానసికంగా దృఢంగా ఉంచేందుకు అతడి మాతృభాషలోని పాటలను మేం పెట్టేవాళ్లం."
-డాక్టర్ చంద్రకాంత్ ఘార్వాడే
అజిత్ తన చేతిని పూర్తిగా కదిపేందుకు మరిన్ని సర్జరీలు అవసరమవుతాయని డాక్టర్ ఘార్వాడే తెలిపారు. ఇందుకోసం తాము మరో 2- 3 ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయడంలో పూర్తి బృందం కృషి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అంబులెన్సులో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకు- రోగి మృతి
ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనే నోటి మాత్రపై ఫైజర్ దృష్టి!