దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ సాయాన్ని దిల్లీ ప్రభుత్వం కోరింది. కొవిడ్ బోగీల ద్వారా 5,000 పడకలను శాకర్ బస్తీ, ఆనంద్ విహార్ స్టేషన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మకు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ దేవ్ లేఖ రాశారు.
"దిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆధ్వర్యంలోని పడకలు నిండిపోతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి చికిత్స అందించేందుకు అత్యవసరంగా మరిన్ని పడకలు కావాల్సి ఉంటుంది. అందుకే.. ఆనంద్ విహార్, శాకుర్ బస్తీ ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లలో 5,000 పడకల సామర్థ్యంతో కొవిడ్ బోగీలను ఏర్పాటు చేయాల్సిందిగా దిల్లీ ప్రభుత్వం తరఫున కోరుతున్నాం."
- విజయ్ కుమార్ దేవ్, దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అంతకుముందు.. దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతితో పరిస్థితి క్షణక్షణానికి తీవ్రరూపు దాలుస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీ అంతటా కలిపి వంద ఐసీయూ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. 24గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేటు 24 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి చేరుకుందని ఆయన వెల్లడించారు.
4,002 కొవిడ్ బోగీలున్నాయ్..
మరోవైపు... తమ వద్ద 16 జోన్లలో 4,002 కొవిడ్ బోగీలు సిద్ధంగా ఉన్నట్లు భారతీయ రైల్వే బోర్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే వీటిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'కొవిడ్ పోరులో రాష్ట్రాలకు పూర్తి సహకారం'