దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు అందించే ప్రక్రియలో(Vaccination) భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తామే ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఉచిత టీకా డోసులను జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ సాగుతున్న తీరు ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు స్పష్టంచేసింది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది.
75% కేంద్రానికే..
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని(free Vaccination) కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత క్రమం ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందించాలని సూచించింది. 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్ చేపట్టాలని కేంద్రం పేర్కొంది. టీకా డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలని సూచించింది. టీకా కోసం కొవిన్ ప్లాట్ఫామ్లో నమోదుతో పాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది. రాష్ట్రాలు కాల్ సెంటర్లు, కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని పేర్కొంది.
రూ. 150 గరిష్ఠం..
టీకా తయారీ దారులు తమ నెలవారీ ఉత్పత్తిలో 25శాతం టీకా డోసులను నేరుగా ప్రైవేట్ ఆస్పత్రులకు విక్రయించుకోవచ్చన్న కేంద్రం పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే డోసుల ధరలను తయారీదారులు ముందుగానే ప్రకటించాలని పేర్కొంది. టీకాలపై(Vaccination) ఛార్జీలను కూడా వెల్లడించాలని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసుం గరిష్ఠంగా 150 మాత్రమే తీసుకోవాలంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు ఉచిత వ్యాక్సిన్ పొందేందుకు అర్హులేనన్న కేంద్రం.. టీకా కోసం చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది.
ఎలక్ట్రానిక్ వోచర్లకు ఓకే..
లోక్ కల్యాణ్ స్ఫూర్తిలో భాగంగా ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారికి ప్రైవేట్ కేంద్రాలలో కొవిడ్ టీకాలు అందించే ప్రక్రియకు ఆర్థికంగా సహకారం అందించాలనుకునే వారికోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన ఎలక్ట్రానిక్ వోచర్లను ప్రోత్సహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. బదిలీ చేసేందుకు వీలుకాని ఈ ఎలక్ట్రానిక్ వోచర్ల సాయంతో ప్రైవేట్ కేంద్రాలలో టీకాలు పొందవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: 'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా'