Waseem Rizvi converted to Hinduism: ఉత్తర్ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్, ముస్లిం నేత సయ్యద్ వసీమ్ రిజ్వీ ఇస్లాంను వదిలి.. హిందూ మతాన్ని స్వీకరించారు. గాజియాబాద్లోని డాసనా దేవి ఆలయంలో నరసింహానంద సరస్వతి మహారాజ్ ఆధ్వర్యంలో హైందవ సంప్రదాయ పద్ధతుల్లో హిందువుగా మారారు. తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీగా మార్చుకున్నారు.
డాసనా దేవి ఆలయంలో కార్యక్రమాల అనంతరం మాట్లాడిన రిజ్వీ.. తనను కొందరు ఇస్లాం నుంచి వెళ్లగొట్టినట్లు చెప్పారు. ఎందుకు మతం మారారని ప్రశ్నించగా.. ఇక్కడ మతమార్పిడి అనేది లేదని పేర్కొన్నారు.
"ఇస్లాం నుంచి బయటకు పంపించాక ఏ మతం తీసుకోవాలనేది నా ఇష్టం. ప్రపంచంలో సనాతన ధర్మమే తొలి మతం. అందులో ధర్మం, మానవత్వం ఉంది. అది ఏ మతంలోనూ లేదని నేను నమ్ముతున్నా."
- జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీ(వసీమ్ రిజ్వీ)
గాజియాబాద్లోని డాసనా దేవి ఆలయంలో సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత హిందువుగా నామకరణం చేసినట్లు చెప్పారు యతి నరసింహానంద సరస్వతి. త్యాగీ వర్గం ప్రజలు సమావేశమై చర్చించుకున్న తర్వాతే జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీ పేరును ఎంపిక చేసినట్లు చెప్పారు. త్యాగీ తన సోదరుడని, ఇప్పటి నుంచి తన తండ్రికి ఇద్దరు కుమారులని తెలిపారు. చాలా సంతోషంగా ఉందన్నారు.
గతంలోనే వెల్లడించిన రిజ్వీ..
హిందూ మతం స్వీకరించాలనుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ వీడియో ద్వారా సందేశం అందించారు రిజ్వీ. తన మరణానంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ఖననం చేయొద్దని కోరారు. తన పార్థివదేహాన్ని హిందూ స్నేహితుడు, మహంత్ నరసింహానంద సరస్వతికి అప్పగించాలని సూచించారు. ఆయనే తన చితికి నిప్పు పెట్టాలనే తన కోరికను వెల్లడించారు. కొంత మంది తనను చంపాలనుకుంటున్నారని, మరణానంతరం తన శరీరాన్ని ముస్లిం స్మశానంలోకి అనుమతించమని చెబుతున్నారని తెలిపారు.
ముస్లింల ఆగ్రహం..
ఖురాన్లోని 26 వాక్యాలను తొలగించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసిన క్రమంలో ముస్లింల ఆగ్రహానికి లోనయ్యారు రిజ్వీ. వీటిని హజ్రత్ అబూ బకర్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్ తొలి ఖలీఫా ఖురాన్లోకి చొప్పించారని, జిహాద్ను ప్రోత్సహించేందుకు ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ 26 వాక్యాలను తొలగించి సరికొత్త ఖురాన్ను సిద్ధం చేసినట్లు చెప్పారు రిజ్వీ. ఒక కాపీని ప్రధాని మోదీకి పంపించినట్లు చెప్పారు. మదర్సాలు, ముస్లిం విద్యా సంస్థల్లో కొత్త ఖురాన్ ఉపయోగించేలా చూడాలని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: భారత్ 'ఆపరేషన్ ట్రైడెంట్'.. పాక్ వెన్నులో వణుకు