గంగానదిలో కరోనా అనుమానిత మృతదేహాలు భారీగా వెలుగుచూసిన వేళ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు సంబంధిత జిల్లా గంగా కమిటీలకు లేఖలు రాసిన కేంద్రం.. గంగా నదితో పాటు దాని ఉప నదుల్లో ఎక్కడా మృతదేహాలు వేయకుండా నిఘా పెంచాలని స్పష్టం చేసింది.
ఇలాంటి ఘటనలు గంగా నదిని కలుషితం చేయడం సహా ఆ నదీ పరివాహక ప్రాంతాలను విషతుల్యం చేస్తాయని కలెక్టర్లకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. ఈ చర్యలు నిరోధించడానికి తీసుకుంటున్న కార్యాచరణ ఏమిటన్న దానిపై 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.
బిహార్లోని బక్సర్ జిల్లా పరిధిలో గంగానదిలో తేలుతున్న.. దాదాపు 71 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆ రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ మృతదేహాలు ఎగువున ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయని.. వారు చనిపోయి ఐదారు రోజులు అయి ఉంటుందని బిహార్ జలవనరుల శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?