జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు.
ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా సైతం నోటీసు ఇచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలన్ని కనే దంపతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించకూడదని ప్రతిపాదిత చట్టంలో పేర్కొన్నారు. జనాభా పెరుగుదల దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోందని చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ చట్టం అత్యావశ్యకమని అన్నారు.
ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి, జనాభా నియంత్రణ చట్టాలను భాజపా తన సైద్ధాంతిక అజెండాలో భాగంగా పరిగణిస్తోంది. అయితే, వీటిపై దేశంలో వివిధ వర్గాల నుంచి భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు బిల్లు అంటే?
మంత్రులు కాకుండా సాధారణ ఎంపీ ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేటు బిల్లులు అంటారు. ప్రభుత్వ మద్దతు లేకుండా రూపొందే ఈ బిల్లులు.. చట్టరూపం దాల్చే అవకాశం చాలా తక్కువ. 1970 నుంచి ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్ గడప దాటలేదు. మొత్తంగా 14 ప్రైవేటు బిల్లులు పార్లమెంట్లో చట్టాలుగా మారాయి.
ఇదీ చదవండి: 'ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు'