పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కాన్పుర్లో వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. యతీంఖానా పోలీసు స్టేషన్ లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్కు నిప్పంటించారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు ప్రయోగం చేశారు పోలీసులు. లాఠీఛార్జీ చేశారు.
ఇద్దరు రాజకీయ నేతల అరెస్టు...
ముందస్తు జాగ్రత్తగా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పేయీ, మాజీ శాసనసభ్యుడు కమలేశ్ తివారీలను అరెస్టు చేశారు అధికారులు. నేతల వాహనాలను సీజ్ చేశారు.
బాబుపూర్వా, నాయి సడక్, మూల్గంజ్, దలేల్పూర్వా, హలీమ్ కళాశాల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతర్జాల సేవల రద్దు...
లఖ్నవూలో పౌర చట్టానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను రెచ్చగొట్టే సమాచారం వ్యాప్తి చెందకుండా డిసెంబర్ 23 వరకు అంతర్జాల సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
15 మంది మృతి..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 8 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:రేపు రాజ్ఘాట్ వేదికగా సోనియా, రాహుల్ 'పౌర' ధర్నా