అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.... బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దిబ్రూగడ్, గువహటి జిల్లాల్లో నది ప్రమాదస్థాయిని దాటి ప్రవాహిస్తోంది. గొలాపార ప్రాంతంలో అనేక ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. ప్రజలు నడుము లోతు నీళ్లలో పడవల మీద ప్రయాణిస్తున్నారు. వరదలు ముంచెత్తుతుండటంతో 17వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
అనేక చోట్ల నీటి ప్రవాహ ఉద్ధృతికి.. నది తీరం కోతకు గురవుతోంది. పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మే 16 నుంచి బ్రహ్మపుత్ర నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. ప్రతి రెండు మూడు గంటలకు నదిలోని నీటిమట్టం 2 సెంటీ మీటర్ల మేర పెరుగుతోందని తెలిపింది. ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు తెలిపే ఎరుపు రంగు జెండాలను నదిలో ఏర్పాటు చేసిన అధికారులు... పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రోగనిరోధకశక్తిని పెంచే ఔషధాలపై 'హామ్దర్ద్' ట్రయల్స్