కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లుగా అమేఠీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఇంత కాలం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ అభివృద్ధి పై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాహుల్పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
" రాముడి వనవాసం 14 ఏళ్లలో పూర్తయింది. కానీ అమేఠీ వనవాసం 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముగుస్తుంది. మే6(పోలింగ్ రోజు)న అమేఠీ ప్రజలు రాహుల్ గాంధీని సాగనంపుతారు. కాంగ్రెస్ 55ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తోంది" -స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
అధికారం కోసం ఓట్లు అడిగేందుకు మాత్రమే రాహుల్ గాంధీ అమేఠీ ప్రజల దగ్గరకు వస్తారని స్మృతి విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆయన కొంత కూడా ఆలోచించలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన విమర్శలపైనా స్పందించారు ఇరానీ. విలువలు లేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్యమొచ్చి 70ఏళ్లు దాటినా అమేఠీలో కనీస సదుపాయాలు లేవని, రైతులు సాగు చేస్తున్న పంటలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్మృతి ఇరానీ.
కాలికాన్ధామ్లో ఫక్కడ్ బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు స్మృతి. అక్కడి భక్తులతో కాసేపు మాట్లాడారు. దీదీ అని అప్యాయంగా పిలుస్తున్న అమేఠీ ప్రజలను ఎప్పటికీ విడిచి వెళ్లనని హామీ ఇచ్చారు ఇరానీ.