కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత మరో చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రమాణపత్రంలో ప్రతి ఎన్నికకో డిగ్రీ చదివానని అఫిడవిట్ ఇస్తూ... స్మృతి ఇటు ప్రజల్ని, అటు వ్యవస్థల్ని అవమానిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది దుయ్యబట్టారు. స్మృతీ ఇరానీ టీవీ ధారావాహిక... సాస్ భీ కభీ బహూ థీ(అత్తా ఒకప్పటి కోడలే) గీతానికి పేరడీ కట్టి పాడి వినిపించారు ప్రియాంక. గత మూడు ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు సమర్పించిన ప్రమాణపత్రంలో వేర్వేరు విద్యార్హతల్ని పొందుపరిచారని చెప్పారు.
త్వరలో 'క్యూంకీ మంత్రీ భీ కభీ గ్రాడ్యుయేట్ థీ' అనే సీరియల్ వస్తోందంటూ స్మృతీ ఇరానీపై చతుర్వేది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరడీ పాట పాడి ఆశ్చర్యపరిచారు.
"2011లో బీఏ చదివానని పేర్కొన్న స్మృతి ఇరానీ... ఈసారి బీకామ్ చదివానని చెప్పారు. అందులోనూ విద్యాసంవత్సరం 1994కు మారిపోయింది. 2014 ఎన్నికల అఫిడవిట్లో దిల్లీ యూనివర్శిటీ నుంచి 1994లో ఓపెన్ డిగ్రీ చదివానని పేర్కొన్నారు. ఇలా వేర్వేరు డిగ్రీలు సమర్పిస్తున్నారు. డిగ్రీల గురించి అడిగితే తన వద్ద యేల్ యూనివర్శిటీ డిగ్రీ కూడా ఉందంటున్నారు. ఈసారి అఫిడవిట్లో అది సమర్పిస్తారనుకుంటే మాకు నిరాశే మిగిలింది. ఆమె గత నాలుగు అఫిడవిట్లలో వేర్వేరుగా విద్యార్హతలు ప్రకటించి దేశాన్ని, ప్రజలను మోసం చేశారు."
-ప్రియాంక చతుర్వేది
పాట సాగుతుందిలా...
"క్వాలిఫికేషన్ కే రూప్ బదల్తే హై... నయే నయే సాంచేమే ఢల్తే హై... ఏక్ డిగ్రీ ఆతీ హై... ఏక్ డిగ్రీ జాతీ హై... బన్తే అఫిడవిట్ నయే హై...(విద్యార్హతలకూ రూపం మారిపోతుంది... కొత్త కొత్త రూపాల్లో దర్శనమిస్తుంది... ఒక డిగ్రీ వస్తుంది. ఒక డిగ్రీ పోతుంది... ప్రమాణపత్రం కొత్తగా తయారవుతుంది)" అంటూ స్మృతీ ఇరానీని విమర్శిస్తూ వ్యంగ్యంగా పేరడీ పాట పాడారు.