దేశ రాజకీయాల గురించి తెలిసినవారికి శరద్ పవార్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయత విషయంలో సోనియాతో విభేదించి.. కాంగ్రెస్ను కాదని సొంతంగా పార్టీ పెట్టడమే కాదు... అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి. లౌకికవాదం విషయంలో భాజపాతోనూ.. జాతీయత వివాదంతో కాంగ్రెస్తోనూ దూరంగా ఉంటూ వచ్చిన వ్యక్తి. మరాఠా యోధుడిగా పేరొందిన ఆయన రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఓ పట్టాన అంతు పట్టవు. మహారాష్ట్ర రాజకీయాలను తాను లేకుండా ఊహించలేం అన్నంత ప్రభావం చూపిన వ్యక్తి. ఎలాంటి రాజకీయ సమస్య అయినా పరిష్కరించే వ్యక్తిగా పేరొందిన పవార్... చిక్కుల్లో పడినట్టే పడి వాటి నుంచి బయటకు రావడం ఆయనకే చెల్లింది. ఈ మాటలన్నింటికీ మరోసారి నిదర్శనంగా ఫలితాలు చూపించారు.. పవార్.
భాజపాకు ఊహించని ఝలక్
మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే శరద్ పవార్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది మరోసారి అందరికీ అర్థమై ఉంటుంది. తన చేతుల్లోంచి అంతా జారిపోతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. చివరికంటా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన పోరాటం అసలు సిసలు రాజకీయ యోధుడ్ని గుర్తుకు తెస్తుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి పొత్తు కుదుర్చుకొని ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి అనుకున్న తరుణంలో .. శనివారం నాటికి భాజపా ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఇందుకు కేంద్ర బిందువుగా శరద్ పవార్ అన్నయ్య కుమారుడు అజిత్ పవార్ మారారు. కానీ ఈ పరిణామాలతో ఏ మాత్రం తడబడని శరద్ పవార్.. ఇప్పుడు అదే రీతిలో తన దెబ్బ ఎలా ఉంటుందో భాజపాకు రుచి చూపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో భాజపా బలం నిరూపించుకుంటుందన్న సమయంలో ఊహించని మలుపు తిప్పారు శరద్ పవార్.
భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలని చెబుతూ వచ్చిన శరద్పవార్.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. ఆ పార్టీ వేసిన ఎత్తులకు చిత్తయినట్టే అందరూ అనుకున్నారు. కానీ పడిలేచిన కెరటంలా ఒక్కసారిగా భాజపా ఊహకే అందని వ్యూహాలతో చిత్తు చేశారు.
ఎన్నో ఊహాగానాలు
పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయటం.. శరద్ పవార్ నేరుగా ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ అవ్వటం... ఇవన్నీ శరద్ పవార్ వైఖరిపై అనుమానాలు రేకెత్తేలా చేశాయి. అవన్నీ కూడా వ్యుహంలో భాగమేనన్నది విశ్లేషకుల మాట. శరద్ పవార్ కుమార్తె కారణంగా పార్టీలో కుటుంబ పరమైన విబేధాలు ప్రభావం చూపాయన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో పవార్ కుటుంబం, ఎన్సీపీ చీలిపోయాయంటూ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టి పడింది. బాబాయ్, అబ్బాయికి పడటం లేదని.. రాజకీయ వారసత్వం విషయంలో శరద్ పవార్ కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే అజిత్ పవార్ వేరుకుంపటి పెట్టినట్టు చెప్పుకున్నారు. ఈ విషయంలో శరద్ పవార్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
భాజపాకు ఎప్పుడైతే అజిత్ పవార్ మద్దతిచ్చారో అప్పుడే శరద్ పవార్ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ బహిరంగంగానే చెప్పింది. అజిత్ పవార్ విషయంలో తన పాత్ర ఏ మాత్రం లేదని, అది ఆయన వ్యక్తిగత విషయమని శరద్ పవార్ చెప్పినప్పటికీ చాలామంది దాన్ని విశ్వసించలేదు. చివరకు ఎన్పీపీ శాసనభాపక్ష నేత పదవి నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్టు కూడా శరద్ పవార్ ప్రకటించారు. అయినాకానీ ఇదంతా కావాలని చేస్తున్నదే అన్నట్టు చాలా మంది భావించారు. శరద్ పవార్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో భాజపాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యేలందరితో కలిపి మహా బలప్రదర్శన నిర్వహించారు.
గోవా కాదు మహారాష్ట్ర...
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ కూటమికే మెజార్టీ ఉందనీ.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన నిర్వహించారు. కర్ణాటక, గోవా, మణిపూర్లో మెజార్టీ లేకపోయినా భాజపా ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేసిన పవార్.. ఇది గోవా కాదు.. మహారాష్ట్ర అని తెలుసుకోవాలని భాజపాను పరోక్షంగా హెచ్చరించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆరంభం నుంచి తనదైన శైలిలో వ్యూహాలు నెరుపుతూ వచ్చిన శరద్ పవార్ ఈసారి దాన్ని మరింత రక్తి కట్టించారు. ఎన్సీపీ ,శివసేన, కాంగ్రెస్ కూటమికి చివరి నిమిషంలో ఎలాగైతే భాజపా ఝలక్ ఇచ్చిందో అదే తరహాలో శరద్ పవార్ కూడా భాజపాకు షాక్ ఇచ్చారు.
50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశారు శరద్ పవార్ . కష్టాలు ఎదురయినా అవన్నీ తాత్కాలికమేనని అంటారు. ప్రజలు తన వెంట నిలబడితే చాలని చెప్పే ఆయన ఈసారి మరాఠాల ఆత్మగౌరవం నినాదంతో పాటు తన 50 ఏళ్ల రాజకీయ జీవితసారాన్ని సమస్య పరిష్కారానికి వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది.
మోదీ-షా గురి పవారే..!
మహారాష్ట్రలో కొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ చదరంగాన్ని పరిశీలిస్తే అందులో శరద్ పవార్ కీలకంగా కనిపిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ-షా కాంగ్రెస్ నాయకులపై కాకుండా ఎన్సీపీ అధినేత శరద్ పవార్పైనే విమర్శలు గుప్పించారు. శరద్పై ఎందుకు గురిపెట్టారన్నది అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపించినందున ఎన్సీపీకి చెందిన పలువురు నాయకులను భాజపాలోకి ఆకర్షించి టికెట్లు ఇచ్చారు. పరిస్థితిని గమనించిన మరికొందరు శివసేనలోకి వెళ్లారు. పవార్ ఒంటరి అయ్యారని, ఆయన రాజకీయ జీవితం ముగిసిందని దేవేంద్ర ఫడణవీస్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ప్రజల్లో సానుభూతి
భాజపాపై ఒంటి చేత్తో పోరాడాలని శరద్ నిర్ణయం తీసుకున్నారు. శరద్పై అమిత్ షా వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇందుకు శరద్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. తాను రాష్ట్రానికి ఏమి చేసినా, చేయకున్నా జైలుకు మాత్రం వెళ్లలేదంటూ చురకలు వేశారు. సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్ పవార్పై కూడా ఈడీ కేసు పెట్టింది. శరద్ పవార్ స్వయంగా ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. తనను ఎప్పుడైనా విచారించుకోవచ్చంటూ అధికార్లకు సవాలు చేశారు. సహకార బ్యాంకులో సభ్యత్వమే లేని తనపై ఎలా కేసు పెడతారని నిలదీశారు. దీంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి లభించింది.
భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానీయబోనంటూ శరద్ పవార్ ఒంటరిగానే రాష్ట్రమంతటా విస్తృత ప్రచారం చేశారు. దీంతో చివరి రోజుల్లో రాజకీయ వాతావరణం మారింది. సులువుగా అధికారంలోకి వస్తామనుకున్న భాజపాకు కష్టకాలం ఎదురయింది. భాజపాకు మద్దతు ఇవ్వకూడదని శివసేన నిర్ణయించడం పవార్కు కలిసి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు తనదైన శైలిలో చక్రం తిప్పారు. అప్పటివరకు పెదవి విప్పని మోదీ-షా రహస్యంగా కార్యాచరణ జరిపి సొంత కుటుంబ సభ్యునితోనే పవార్పై దెబ్బతీయాలని చూశారు. కానీ ఆ వ్యూహం భాజపాకే ఎదురు తిరిగినట్టయింది.