కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదంపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రావెన్ కోర్ రాజవంశానికి ఉన్న ఆలయ పాలనాపరమైన హక్కులను సమర్థించింది.
2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. పద్మనాభస్వామి ఆలయ పరిపాలనలో.. ట్రావెన్కోర్ పూర్వపు రాజకుటుంబ హక్కులను సమర్థించింది. చివరి పాలకుడి మరణం కారణంగా రాజకుటుంబం తమ హక్కులను ప్రభుత్వానికి వదులుకోదని స్పష్టం చేసింది. పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యత రాజకుటుంబానికే అప్పగించింది.
కమిటీ ఏర్పాటు..
ఆలయ కార్యకలాపాల నిర్వహణకు.. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఏమిటి ఈ వివాదం?
ఆలయ నిర్వహణపై 2009లో విశ్రాంత ఐపీఎస్ అధికారి టీపీ సుందరరాజన్ కేరళ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజవంశస్థుల నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలను కేరళ ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. అయితే, ఆలయ విషయంలో ఎలాంటి వివాదం లేదని... సంప్రదాయ, ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.
అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదానికి సంబంధించి... మొదట 2011 జనవరి 31న కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ ఆస్తులు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకుని ఆలయంపై నియంత్రణను చేపట్టాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1991లో ట్రావెన్కోర్ చివరి పాలకుడి మరణంతో కుటుంబ హక్కులు నిలిచిపోయాయని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఆలయంలో కల్లారాలుగా పిలిచే.. అన్ని నేలమాళిగలను తెరిచి, లెక్కింపు చేపట్టాలని తీర్పునిచ్చింది హైకోర్టు. ఆభరణాలు, విలువైన వస్తువులతో కూడిన జాబితా తయారు చేసి ప్రజలు, భక్తులు, పర్యటకులకు ప్రదర్శించడానికి మ్యూజియం వంటి ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక శతాబ్దాల కాలంలో స్వాధీనం చేసుకున్న ఆలయ సంపదను.. రహస్యంగా ఉంచడంలో అర్థం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టుకు రాజవంశస్థులు..
కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. ట్రావెన్ కోర్ రాజవంశస్థులు మహారాజ ఉత్రదామ్ తిరునాల్ మార్తాండ వర్మ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వహణపై హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని, ఆలయ నిర్వహణ బాధ్యతలను గతంలో మాదిరిగానే తమకు అప్పగించాలని కోరారు.
హైకోర్టు తీర్పుపై స్టే..
2011 మే 2 న కేరళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేలమాళిగల్లోని విలువైన వస్తువులు, ఆభరణాలపై వివరణాత్మక జాబితా రూపొందించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నేలమాళిగ-బీని తెరవడాన్ని నిలిపివేయాలని 2011 జులై 8న పేర్కొంది.
2017 జులైలో ఆలయంలో ఉన్న నేలమాళిగల్లోని ఒకదానిలో ఆధ్యాత్మిక శక్తితో కూడిన అపారమైన నిధి ఉందనే వాదనలను పరిశీలిస్తామని తెలిపింది. దేవస్థానం మరమ్మతులు, నిధుల భద్రత కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధ్యాత్మిక శక్తి ఉందన్న భయంతో మూసివేసిన నేలమాళిగ-బీని తెరవాలని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం సుప్రీం కోర్టుకు సూచించారు. తర్వాత ఆలయంలోని పనులను పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అనంతరం రాజకుటుంబం, కేరళ ప్రభుత్వ వాదనలను పూర్తిస్థాయిలో ఆలకించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతేడాది ఏప్రిల్ 10న తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీం ధర్మాసనం రాజ వంశీయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో మెరుగైన స్థితిలో ఉన్నామా?'