ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన 'కేంద్ర రిజర్వ్ పోలీసు దళం' (సీఆర్పీఎఫ్) సహాయ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్లాల్ ధైర్య సాహసానికి గుర్తింపుగా అత్యున్నతమైన 'రాష్ట్రపతి పోలీసు పతకం' (పీపీఎంజీ) ప్రకటించారు. మంగళవారం జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను సోమవారం ప్రకటించారు.
కేంద్ర హోంశాఖ వెల్లడించిన జాబితా ప్రకారం 207 మంది పోలీసులకు సాహస పురస్కారాలు, 89 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 650 మంది పోలీసులకు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను అక్కడి పికెట్ కమాండర్ మోహన్లాల్ గుర్తించి, అందరినీ అప్రమత్తం చేశారు. కారును ఆపాలని ప్రయత్నించి, దానిని వెంబడించారు. ఆత్మాహుతి దళం ఉన్న కారు వేగాన్ని అందుకోలేక దానిపై కాల్పులు జరిపారు. ఆ కారు సీఆర్పీఎఫ్ బస్సును ఢీకొట్టి, భారీ పేలుడు సృష్టించింది. దానిలో లాల్, మరో 39 మంది సిబ్బంది అమరులయ్యారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో చూపిన సాహసానికి గానూ ఆయనకు పీపీఎంజీని ప్రకటించారు.
మావోయిస్టులను, ఉగ్రవాదులను ఎదుర్కొనే కార్యకలాపాల్లో పాల్గొంటున్న సీఆర్పీఎఫ్ బలగాలకు దీంతో కలిపి ఈ ఏడాది 69 పతకాలు లభించాయి. జమ్మూకశ్మీర్ పోలీసులకు 52, సరిహద్దు భద్రత దళానికి 20, దిల్లీ పోలీసులకు 17, మహారాష్ట్ర పోలీసులకు 13 చొప్పున పతకాలు అందనున్నాయి. ఐటీబీపీలో మొత్తం 17 మందికి పతకాలు ప్రకటించారు.
మార్పులు చేసిన వెబ్సైట్ ఆవిష్కరణ
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సాహస పురస్కారాలు పొందినవారి వివరాలను తెలియజెప్పేలా మార్పులు చేసిన వెబ్సైట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆవిష్కరించారు. సాహస పురస్కారాలపై క్విజ్ పోటీని, 'శౌర్యవాన్' అనే ఆన్లైన్ పత్రికను ప్రారంభించారు. శౌర్యపరాక్రమాలు ప్రదర్శించినవారి వివరాలు ఎల్లప్పుడూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్య సాధనలో సైనిక బలగాల కృషిని విస్మరించలేమన్నారు. వారి త్యాగాలకు విలువ కట్టలేమని చెప్పారు.
ఇదీ చదవండి:అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన