డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) పదవికి కనీసం ఆరు నెలల పదవీకాలం మిగిలున్న అధికారులనే సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
యోగ్యత ప్రాతిపదికనే డీజీపీ ఎంపిక జరగాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
డీజీపీ ఎంపికలో ఎలాంటి అవకతవకలు, పక్షపాత ధోరణికి తావు ఉండకూడదని గతేడాది జులై 3న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక డీజీపీగా నియమించే అధికారులకు తప్పనిసరిగా రెండేళ్ల పదవీకాలం ఉండాలని సూచించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ డీజీపీ ప్రకాశ్ సింగ్ పిటిషన్లో ఆరోపించారు.
రెండేళ్ల పదవీకాలం మిగిలుండాలనే నిబంధన వల్ల నిజాయతీ గల సీనీయర్ అధికారులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. పదోన్నతి పొందే అవకాశం లేకుండానే పదవీ విరమణ పొందాల్సి వస్తోందన్నారు. ఆ ఉత్తర్వులను మార్చాలని అభ్యర్థించారు.
ప్రకాశ్ సింగ్ వాదనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టతనిచ్చింది. ఆరు నెలల పదవీకాలం మిగిలి ఉన్న అధికారులనూా డీజీపీ పదవికి ఎంపిక చేయవచ్చని వివరించింది.