ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు సభ్యులను జమ్ముకశ్మీర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ ఫొటో ఆధారంగా.. కుప్వారా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి సైనిక బలగాల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది...
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలు పట్టుకొని తాము ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నామని తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు కుప్వారా ఎస్ఎస్పీ ఏఎస్ దినకర్ తెలిపారు. ఈ క్రమంలోనే సమాచారాన్ని సేకరించి.. వారి కదలికలను గుర్తించినట్లు వివరించారు. అనంతరం కుప్వారాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.