ఒడిశాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. మల్కాన్గిరి జిల్లాలో ఓ రహదారి నిర్మాణ పర్యవేక్షణాధికారిని హతమార్చారు. మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకుర్ కండి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలను వెల్లడించారు మల్కాన్గిరి ఎస్పీ జగ్మోహన్ మీనా.
రహదారి పనులను పర్యవేక్షిస్తున్న ప్రభాత్ బిషోయి అనే సూపర్వైజర్ను 25 మంది మావోయిస్టులు బంధించి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత హతమార్చారు. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న సహోద్యోగులు, కూలీలు భయంతో పరుగులు తీశారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఉన్న వాహనాలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి సమీపంలో బిషోయి మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించక ముందే మవోయిస్టులు హెచ్చరికలు చేసినట్లు సమాచారం.
మావోయిస్టులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్కి చెందిన రెడ్ రెబల్స్ హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.