గత నెల 20న అమెరికా నుంచి దిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఓ యువతి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంట్లోనే 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ నెల 3తో ఆ గడువు ముగిసిపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులతో సాధారణంగానే గడిపారు. కాగా ఆ యువతిలో ఆలస్యంగా అంటే భారత్లో అడుగుపెట్టిన 18 రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా ఆమెకు వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఈ తరహాలో కొందరిలో కరోనా లక్షణాలు ఆలస్యంగానూ వెలుగులోకి వస్తున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు.. 95 శాతం కేసుల్లో సగటున 5.2 రోజుల్లోనే లక్షణాలు బయటపడుతుండగా.. మిగిలినవి 14 రోజుల గడువు లోపల వెలుగులోకి వస్తున్నాయి.
అరుదుగా కొందరిలో 21 రోజుల్లోపూ బయటపడే అవకాశాలున్నాయి. ఇలాంటి కేసులు వెలుగు చూస్తుండడంతో.. 14 రోజుల తర్వాత కూడా కొద్దిరోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండడమే మేలని వైద్యవర్గాలు అంటున్నాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దిల్లీకి వెళ్లి వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షల్లో ఈ తరహా కేసులు వెలుగులోకి వచ్చాయి. ముక్కు కారడం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే.. కనీసం విడిగా ఉండడానికి, స్వీయ నియంత్రణ పాటించడానికి, వైద్యుడిని సంప్రదించడానికి అవకాశాలుంటాయి. కానీ ఈ లక్షణాలేవీ కనిపించకుండా ఉంటే అందరిలాగే సాధారణంగానే గడుపుతుంటారు. ఇలాంటి వారితోనే సమాజంలో కరోనా త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలెక్కువని వైద్యవర్గాలు చెబుతున్నాయి.