అసోంలోని టిన్సుకియా జిల్లాలో చమురు బావిలో చెలరేగిన మంటలు ఇప్పటికీ అదుపు కాలేదు. రోజురోజుకూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. వీటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.



ఇటీవలే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చమురు బావి ప్రమాదంతో ప్రభావితమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం సహా అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా సామర్థ్యాలను మెరుగుపరచాలని తెలిపారు మోదీ.
27నే గ్యాస్ లీకేజీ...
ఆయిల్ ఇండియాకు చెందిన బాఘ్జన్-5 చమురు బావిలో మే 27నే గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే జూన్ 9న మంటలు అంటుకున్నాయి. పది రోజులకుపైగా జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వాటిని నియంత్రించేదుకు విదేశీ నిపుణులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 9వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1,610 కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ. 30వేలు అందించారు.
ఇదీ చూడండి:సరిహద్దుల్లో సమర ధ్వని.. రంగంలోకి వాయుసేన