సాధారణంగా పోటీల్లో పాల్గొనేవారంతా ప్రతిభను ప్రదర్శిస్తారు. అయితే అందులో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఓడినవారికి నిరాశ కలగడం సహజమే. వారు మరో సారి ప్రయత్నిద్దామనుకుని సర్దుకుపోతారు. కానీ, రాజస్థాన్ అజ్మేర్లోని కొందరు కండల వీరులు మాత్రం విజేతపై పీకల దాకా కోపం పెంచుకున్నారు. వేదికపైనే పిడిగుద్దులు కురిపించారు. వర్గాలుగా చీలిపోయి నానారభస సృష్టించారు.
కిసాన్గఢ్లో ఓ సేవా సంఘం నిర్వహించిన 'మిస్టర్ హీ మ్యాన్ ఆఫ్ అజ్మేర్' పోటీల్లో విజేతను ప్రకటించగానే మొదలైన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. ఓటమిని భరించలేకనే కొందరు ఇలా హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
"బాడీ బిల్డింగ్ వేదికపై ఘర్షణ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలంలో అల్లర్లకు పాల్పడుతున్న ముగ్గురిని మేము అరెస్ట్ చేశాము. పోటీల్లో మార్కింగ్ పట్ల అసంతృప్తి చెందిన బాడీ బిల్డర్లు విజేతను ప్రకటించగానే ఉద్రేకంతో ఊగిపోయారు. ఆ కోపంలో వారు దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఏ వర్గమూ మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేయలేదు."
-రోషన్ లాల్, సీఐ
ఇదీ చదవండి:'పౌర' చట్టానికి వ్యతిరేకంగా రంగవల్లులతో డీఎంకే నిరసన