సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోంది. ఘాజీపుర్ సరిహద్దుకు పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. ఆదివారం సైతం వందల సంఖ్యలో అన్నదాతలు.. నిరసనలు కొనసాగుతున్న దిల్లీ-మేరఠ్ రహదారి వద్దకు చేరుకున్నారు.
![Farmers dance to folk tunes at night as cops put up barbed wires, barricades at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10447678_etdszg8w4ae4xrh-2.jpg)
ఇదీ చదవండి: నిరసనలో వైవిధ్యం- వినోదానికీ సంసిద్ధం
గణతంత్ర పరేడ్లో హింస తర్వాత తర్వాత డీలా పడుతుందనుకున్న ఉద్యమం.. బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ ఇచ్చిన పిలుపుతో మళ్లీ ఊపందుకుంది. పశ్చిమ ఉత్తర్ప్రదేశ్ సహా హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి రైతులు ఘాజీపుర్కు వస్తున్నారు. జనవరి 29న 'మహాపంచాయత్' కార్యక్రమం జరిగినప్పటి నుంచి నిరసనకారులు తరలివస్తూనే ఉన్నారు.
![Farmers dance to folk tunes at night as cops put up barbed wires, barricades at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10447678_etdszg8w4ae4xrh-1.jpg)
నిరంతర నిఘా
ఈ నేపథ్యంలో సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఘాజియాబాద్ అధికారులు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదేశానికి వెళ్తున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో పర్యవేక్షణ సాగిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
![Farmers dance to folk tunes at night as cops put up barbed wires, barricades at Ghazipur border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10447678_etdszg8w4ae4xrh-3.jpg)
ఉల్లాసంగా- ఉత్సాహంగా
అత్యంత చలిని ఎదుర్కొని నిరసనలు చేస్తున్న రైతులు.. రాత్రి సమయంలో ఉత్సాహంగా డ్యాన్స్లు చేస్తున్నారు. జానపద పాటలకు స్టెప్పులేస్తున్నారు. దేశభక్తి పాటలను ఆలపిస్తున్నారు. కొంత మంది యువకులు తమ ట్రాక్టర్ ట్రాలీలపై డీజేలను ఏర్పాటు చేసుకున్నారు.
ఇదీ చదవండి: పోరాటం చేస్తున్న రైతులకు వినోదం పంచేందుకు..