పెళ్లి ఘనంగా చేసుకున్నారు. బరాత్ ముగిసింది. ఇక వధువును తీసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్న పెళ్లి కుమారుడి కుటుంబానికి లాక్డౌన్తో చిక్కులొచ్చాయి. వరుడు సహా 11 మంది బంధువులు.. వధువు ఇంట్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 60 రోజులు గడిచాక కొత్త దంపతులు స్వస్థలానికి చేరుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ చౌబేపుర్లోని హకీమ్నగర్ గ్రామానికి చెందిన ఇంతియాజ్, బిహార్ బెగుసరాయ్కు చెందిన ఖుష్భూకు మార్చి 21న వివాహం అయింది. పెళ్లికూతురు స్వస్థలంలో పెళ్లి తంతు ముగిసింది. ఇక వచ్చేద్దాం అనుకునేలోపే మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. రవాణా సదుపాయాలు లేక పెళ్లికొడుకుతో పాటు బంధువులు అందరూ ఏకంగా రెండు నెలలు పెళ్లికూతురు ఇంటిలోనే ఉండిపోయారు. తాజాగా నాలుగోదశ లాక్డౌన్ మినహాయింపుల వల్ల వాళ్లకి ఊరట లభించింది. దాదాపు 60 రోజులు తర్వాత కాన్పుర్లోని స్వస్థలం చేరారు నూతన వధూవరులు.
"వధువు ఇంట్లో చిక్కుకుపోవడం వల్ల చాలా హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాం కానీ మాకు సహాయం అందలేదు. చేసేదేమి లేక వాళ్ల ఇంటిలోనే ఉన్నాం. పెళ్లికూతురు కుటుంబానికి మా వల్ల అధిక భారం పడింది. ఏలాగైతేనే రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ద్వారా పాస్లు పొందాం. ఆ తర్వాత ఓ మినీ బస్సు ఏర్పాటు చేసుకొని మే 19న బెగుసరాయ్ నుంచి బయలుదేరాం. 20 గంటల ప్రయాణంలో హైవే మీద చాలా మంది ఆహారం, మంచినీళ్లు ఉచితంగా అందించారు. ఇబ్బందులు పడి ఇంటికొస్తే కరోనా పరీక్షలు చేసి మమ్మల్ని 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు"
-మెహబూబ్, పెళ్లి కుమారుడి తండ్రి
పెళ్లి బృందానికి అక్కడ స్థానికులు మంచి మద్దుతు ఇచ్చారట. వధువు కుటుంబానికి అందరూ రేషన్ అందించారని తెలిపాడు ఓ బంధువు.