ఝార్ఖండ్లో దారుణం జరిగింది. కారు దిగి రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఓ భాజపా నాయకుడ్ని పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేశారు దుండగులు.
ఇలా జరిగింది..
ధన్బాద్లోని బ్యాంక్ మోర్ ప్రాంతంలో భాజపా నగర ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్(40) కారు దిగి చరవాణిలో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ముఖానికి మాస్కులు కట్టుకొన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై ఆయన్ను అనుసరించారు. సతీశ్ సింగ్ తిరిగి చూసేలోగా తలపై కాల్చి పరారయ్యారు. తక్షణమే సతీశ్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. స్థానిక సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రామ్ కుమార్ తెలిపారు.
'ఇది రాజకీయ కుట్ర?'
అయితే.. ఈ ఘటనపై మృతుడి సన్నిహితుడు, స్థానిక ఎమ్మెల్యే రాజ్ సిన్హా స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య అని అభిప్రాయపడ్డారు. 'అనతికాలంలోనే సతీశ్ సింగ్ ప్రజాదారణ పొందిన వ్యక్తిగా ఎదిగారు. దీన్ని సహించలేకే ఆయన్ను హత్య చేశారు' అని సిన్హా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఈ చిరు చిట్కాలతో తలనొప్పిని తరిమేయండిలా..