దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీలో నిజాముద్దీన్ జమాత్ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మంది వైరస్ బారిన పడినట్లు గుర్తించారు అధికారులు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,764 యాక్టివ్ కేసులుండగా, 151 మంది కోలుకున్నారు. మరో 50 మంది మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది చనిపోగా.. గుజరాత్-6, మధ్యప్రదేశ్-6, పంజాబ్-4, కర్ణాటక-3, తెలంగాణ-3, బంగాల్-3, దిల్లీ, జమ్ముకశ్మీర్, ఉత్తర్ప్రదేశ్, కేరళలో రెండేసి మరణాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవ్వగా.. 265 కేసులతో కేరళ రెండోస్థానం, 234 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయి.
గుజరాత్లో 7కు చేరిన మృతులు
గుజరాత్ వడోదరాలో 52 ఏళ్ల వ్యక్తి ఇవాళ ఉదయం కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఫలితంగా గుజరాత్ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 87 కేసులు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్లో 8
మధ్యప్రదేశ్లోనూ కరోనాతో ఇవాళ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం 75 కేసులు నమోదయ్యాయి.
దిల్లీ ఎయిమ్స్ డాక్టర్కు కరోనా?
దిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్కు కరోనా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. ఫిజియాలజీ విభాగానికి చెందిన వైద్యుడిని ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
లాక్డౌన్ అతిక్రమిస్తే ఉపేక్షించకండి
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే విపత్తు యాజమాన్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సవివరమైన నిబంధనల జాబితాను రాష్ట్రాలకు పంపారు.
9 వేల మంది నిర్బంధం
దేశవ్యాప్తంగా 9వేల మంది తబ్లీగి జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని, వారితో కలిసి మెలిగిన వారిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
కరోనా హాట్స్పాట్లు
కరోనా హాట్ స్పాట్లలో రాపిడ్ యాంటీ బాడీటెస్ట్లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి నిర్ణయించింది. హాట్ స్పాట్లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు చేసి.. పాజిటివ్గా వస్తే సదరు వ్యక్తిని చికిత్సకు పంపాల్సి ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలని మధ్యంతర సూచనలు జారీ చేసింది వైద్య పరిశోధన మండలి.