కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని నివారణ చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం 12 ప్రధాన ఓడరేవుల్లో నావికులు, ప్రయాణికులను స్క్రీనింగ్, డిటెక్షన్, వ్యాధిసోకిన వారిని వేరుగా ఉంచే వ్యవస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
"నావికులు, ప్రయాణికులకు కరోనా వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఓడరేవుల్లో వెంటనే స్క్రీనింగ్, డిటెక్షన్, వ్యాధిసోకిన వారిని వేరుగా ఉంచే వ్యవస్థలను ఏర్పాటుచేయాలి."- షిప్పింగ్ మంత్రిత్వశాఖ
కట్టుదిట్టంగా
ప్రయాణికులను పరీక్షించడానికి ఎన్-95 మాస్క్లతో పాటు థర్మల్ స్కానర్లను సేకరించాలని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు సిబ్బంది, ప్రయాణికుల నుంచి స్వీయ డిక్లరేషన్ తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. పోర్ట్ ఆసుపత్రులు, ప్రాంగణాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేయాలని, తీవ్రమైన కేసులను పెద్దాసుపత్రులకు తరలించాలని పేర్కొంది. అలాగే ఈ విషయాలను క్యాబినెట్ సచివాలయానికి రోజువారీగా తెలియజేయాలని నిర్దేశించింది.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రధాన ఓడరేవులన్నీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) జారీచేయడం సహా అనేక చర్యలు చేపట్టాయి. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6 మధ్య చైనా నుంచి భారత్కు వచ్చిన 85 ఓడల్లోని 4,274 ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి.
అవగాహన కోసం
ప్రయాణికుల్లో అవగాహన పెంచడం కోసం పోర్టులు... ఎలక్ట్రానిక్/ప్రింట్ మీడియా ద్వారా (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యునికేషన్) పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆసుపత్రులు, ట్రస్టుల్లో ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు ఏర్పాటుచేసి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాయి.
ప్రధాన ఓడరేవులు
భారత్లో 12 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. కాండ్ల, ముంబయి, జేఎన్పీటీ, మార్ముగావ్, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నూర్, వీఓ చిదంబర్నార్, విశాఖపట్నం, పారాదీప్, కోల్కతా (హల్దియాతో సహా). దేశంలోని మొత్తం సరుకు రవాణాలో సుమారు 61 శాతం ఈ ఓడరేవుల ద్వారానే జరుగుతుంది.
మహమ్మారి విజృంభణ
చైనా వుహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్.. భారత్తో సహా 25 దేశాలకు వ్యాపించింది. చైనాలో ఇప్పటి వరకు 722 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. మరో 34 వేల మందికి సోకింది. భారత్లోని కేరళలోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: 'వాట్సాప్ పే'కు ఎన్పీసీఐ అనుమతి