అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ మంత్రి పి. పొన్నయన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. గత నెల 12న తమిళనాడు రాజధాని చెన్నైలో ఫ్లెక్సీ పడి 23ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందడానికి గాలి కారణన్నారు పొన్నయన్. అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా ప్రమాదం జరగలేదని, గాలి వల్లే అలా అయిందని అన్నారు పొన్నయన్. అందుకే గాలిపైనే కేసు నమోదు చేయాలని సూచించారు.
"కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకలో భాగంగా జయగోపాల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన కావాలని ఫ్లెక్సీని శుభశ్రీ మీదకు విసరలేదు. జయగోపాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదు. గాలి వల్లే ఆ ఫ్లెక్సీ పడిపోయింది. కాబట్టి గాలిపైనే కేసు పెట్టాలి."
-పొన్నయన్, తమిళనాడు మాజీ మంత్రి.
పొన్నయన్ వాఖ్యలను ప్రతిపక్షాలు, సామజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతల మొరటుతనానికి నిదర్శనమని డీఎంకే అధికార ప్రతినిధి విమర్శించారు.
గత నెలలో ప్రమాదం
సెప్టెంబరు 12న చెన్నైలో స్కూటీపై ప్రయాణిస్తోంది 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని శుభశ్రీ. అకస్మాత్తుగా ఓ ఫ్లెక్సీ పైనుంచి వచ్చి ఆమెపై పడగా... స్కూటీ అదుపు తప్పింది. వెనకాల వస్తున్న ట్యాంకర్ శుభశ్రీ పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
హోర్డింగ్లు ఏర్పాటు చేయొద్దని తమిళనాడు హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినా అక్రమంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్ జయగోపాల్. శుభశ్రీ మరణం అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: సెజ్లోకి అనుమతి నిరాకరించారని కత్తులతో దాడి