జల ప్రళయం సృష్టించిన ధౌలీగంగ నది ప్రవాహ మార్గం వంపులు తిరుగుతూ వయ్యారంగా సాగిపోతుంటుంది. ఉత్తరాఖండ్లో అతిపెద్ద హిమనీనదమని భావించే వసుధరా తాల్ దీని జన్మస్థలం. ఈ నది ప్రవహించే మార్గం మొత్తం అత్యంత మనోహరంగా ఉంటుంది. ధౌలీగంగ నది తొలుత అలకనందతో కలుస్తుంది. రైనీ వద్ద రుషిగంగాతో కలుస్తుంది. అక్కడి జలవిద్యుత్ కేంద్రం వద్దనే తాజా ఘటన చోటు చేసుకుంది. రుషిగంగాతో కలిశాక ధౌలీగంగ.. ఆంగ్ల అక్షరం 'వి' ఆకారంలో మలుపు తీసుకుని వ్యతిరేక దిశలో ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. తపోవన్ మీదుగా ఇది దాదాపు 30 కి.మీ. మేర సాగుతుంది. జోషీమఠ్ సమీపంలో విష్ణుప్రయాగ వద్ద ఇది అలకనంద నదితో కలుస్తుంది.
ఆ తర్వాత ఇక ధౌలీగంగ ఉనికి ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి ఛమోలీ, మైథానా మీదుగా అలకనంద ప్రవాహమే కొనసాగుతుంది. దానికి రుద్రప్రయాగ వద్ద మందాకిని నది కలుస్తుంది. అవి రెండూ కలిసి కేదార్నాథ్ సమీపంలో దేవ్ప్రయాగ్ వద్ద గంగానదిలో కలుస్తాయి. అక్కడి నుంచి గంగానది ప్రవాహం కొనసాగుతుంది. ఉప నదుల్లో ధౌలీగంగ ఒకటి కాగా.. నందాకిని, పిండర్, మందాకిని, భగీరథి అనేవి ఇతర ఉప నదులు. అయిదు రాష్ట్రాలకు చెందిన వేర్వేరు పట్టణాల మీదుగా ఈ ఉప నదులు ప్రవహిస్తుంటాయి. రిషికేశ్, హరిద్వార్, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ వంటి సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలను గంగానది, దాని ఉప నదులు తాకుతూ ప్రవహిస్తుంటాయి.
ఆదివారం నాటి ఘటనతో ధౌలీగంగకు మెరుపు వరదలు రావడం సహా.. పాటు రిషి గంగ, అలకనంద వంటి ఉప నదులపైనా ప్రభావం పడింది. 2013లో సంభవించిన మెరుపు వరదల సమయంలోనూ ఈ నదుల వల్లనే ఎక్కువ నష్టం వాటిల్లింది.
![Dhauliganga River](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10541115_dhauliganga2.jpg)
జవాన్లు.. మరో జన్మనిచ్చిన దాతలు
శత్రువులను గడగడలాడించే జవాన్లు.. అసహాయులకు మరో జన్మనిచ్చిన దాతలయ్యారు. తపోవన్ జలవిద్యుత్తు కేంద్రం వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు చేసిన సాయం, చూపిన సాహసం ప్రశంసలు అందుకున్నాయి. పెద్ద శబ్దం, జనం కేకలు వినిపించడంతో జోషిమఠ్ క్యాంపులోని ఐటీబీపీ జవాన్లు అప్రమత్తమయ్యారు. తాళ్లు, కొండలు ఎక్కి దిగేందుకు ఉపయోగించే పరికరాలు, ఇతర సామగ్రితో బయలుదేరారు. వచ్చి చూస్తే బురదలో కూరుకుపోయిన జనం. వారంతా అక్కడ పనిచేసే కూలీలే. వారిని వెలికితీసేందుకు అడ్డంగా, నిలువుగా తవ్వుకుంటూ లోనికిపోయారు. తాళ్ల సాయంతో వారిని బయటకు తీశారు. ప్రాణంపై ఆశలు వదులుకున్న ఆ బాధితుల ఆనందానికి అవధుల్లేవు. ‘నయీ జిందగీ మిలీ’ (కొత్త జీవితం వచ్చింది) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సెభాష్, జయహో, జో బోలే సో నిహాల్ అంటూ నినాదాలు చేశారు.
![Dhauliganga River](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10541115_dhauliganga-jawans.jpg)
రికార్డు స్థాయిలో నీటి మట్టం
వరద వచ్చిన సమయంలో ఉదయం 11 గంటలకు జోషిమఠ్ వద్ద రిజర్వాయర్లో ధౌలీగంగ నది నీటి మట్టం 1,388 మీటర్లుగా నమోదయినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్ సౌమిత్ర హల్దార్ తెలిపారు. ఇది రికార్డని చెప్పారు. సాధారణంగా ఇక్కడ 1,372 మీటర్ల నీటి మట్టం ఉంటుంది.
వరదల దృష్ట్యా ముందు జాగ్రత్తగా తెహ్రీ, కోటేశ్వర్ విద్యుత్తు ప్రాజెక్టుల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. దీనివల్ల 200 మెగావాట్టుల విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది.
హిమానీనద శాస్త్రవేత్తలు నేడు రాక
ప్రమాదంపై అధ్యయనం చేయడానికి హిమానీనద శాస్త్ర నిపుణులు సోమవారం జోషిమఠ్ రానున్నారు. వీరంతా దేహ్రాదూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలియన్ జియాలజీకి చెందిన వారే.
మానవ జోక్యం పెరగడమూ కారణమే..
పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో మానవ జోక్యం పెరగడమే అక్కడ వాతావరణ మార్పులకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో భారీస్థాయి నిర్మాణాలను చేపట్టకూడదని 'గ్రీన్పీస్ ఇండియా' ప్రచారకర్త అవినాశ్ చంచల్ చెప్పారు. తాజా ఘటనకు నిర్దిష్ట కారణం ఇంకా తెలియకపోయినా.. వాతావరణ మార్పులు, భూతాపమే దీనికి దారి తీసి ఉండవచ్చని అర్థమవుతోందని మరో నిపుణుడు అంజల్ ప్రకాశ్ తెలిపారు. ఈ రెండు మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, సరిచేయలేని పరిస్థితికి ఇవి చేరుకున్నాయని చెప్పారు.
క్షీణించిన ఉష్ణోగ్రతలు..
హిమాలయ ప్రాంతాన్ని ఇప్పటివరకు ఎవరూ పెద్దగా పర్యవేక్షించడం లేదని గుర్తుచేశారు ప్రకాశ్. హిమాలయాల్లో మంచు ఉష్ణోగ్రతలు గతంలో మైనస్ 6 నుంచి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే.. ఇప్పుడు మైనస్ 2 మాత్రమే ఉందని ఐఐటీ-ఇండోర్కు చెందిన మహ్మద్ ఫరూక్ అజాం చెప్పారు. దీనివల్లనే ఇవి త్వరగా కరిగిపోతున్నాయన్నారు. తాజా ఘటన లాంటివి మున్ముందు మరిన్ని జరిగే అవకాశం ఉందని మరో నిపుణుడు హెచ్చరించారు. ఉత్తరాఖండ్లోని పౌరీ, తెహ్రీ, రుద్రప్రయాగ, హరిద్వార్, దేహ్రాదూన్ తదితర జిల్లాలకు ముప్పు ఉంటుందని అధికార వర్గాలు ఇప్పటికే గుర్తించాయి.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ విలయం: 14మందికి చేరిన మృతులు