కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని దినాల్లో ఇకపై కార్యాలయాలకు రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లో నివాసం ఉండేవారికి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్న అధికారులు.. ఆ జోన్లు ఎత్తివేసిన తర్వాత కార్యాలయాలకు రావాల్సిందేనని తెలిపారు.
"అన్ని స్థాయుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పని దినాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కార్యాలయానికి వచ్చి పని చేయాలి" అని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ. సమావేశాలను వీలైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించాలని సూచించింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని క్వాంటీన్లను తెరవవచ్చని మరో ఆదేశం వెలువడింది.
కార్యాలయాలను క్రిమిరహితం చేయాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కట్టడికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్వోపీలు) శనివారం జారీ చేసింది. వీటి ప్రకారం ఓ కార్యాలయంలో ఒకటి లేదా రెండు కొవిడ్-19 కేసులు బయటపడితే గత 48 గంటల్లో వారు కూర్చున్న, తిరిగిన ప్రాంతాలను క్రిమిరహితం చేస్తే చాలు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత కార్యాకలాపాలను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ కార్యాలయంలో పెద్దఎత్తున కేసులు బయటపడితే.. తిరిగి కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ఆ భవనం లేదా బ్లాక్ను సంపూర్ణంగా క్రిమిరహితం చేయాలి.
- కంటెయిన్మెంట్ జోన్లలో ఉండే సిబ్బంది ఇంటి నుంచి పనిచేయవచ్చు.
- కార్యాలయాల్లో వీలైనంత వరకు ఆరు ఆడుగుల దూరం పాటించాలి. లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించాలి.
- చేతులు మురికిగా లేనప్పటికీ కనీసం 40 సెకన్ల నుంచి 60 సెకన్లపాటు తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదా 20 సెకన్లపాటు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
ఇదీ చూడండి: కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనీయం: టికాయిత్