ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటోవాలాకు కొత్త జీవితం లభించింది. ఆయ దీనగాథపై స్పందించిన దాతలు రూ.24 లక్షలు సమకూర్చారు. దీంతో ఆ బక్క పల్చని వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అసలు ఎవరీ తాత, ఏమిటి ఆయన గాథ అంటే..
ఆరేళ్ల క్రితం పెద్ద కొడుకును కోల్పోయి, మరి కొద్ది కాలానికి చిన్న కుమారుడిని కోల్పోవడంతో ముంబయికి చెందిన దేశ్రాజ్, ఆయన భార్య, ఇద్దరు కోడళ్లు, వారి నలుగురు పిల్లల జీవితం అగమ్యగోచరంగా మారింది. దీంతో ఆ వృద్ధుడు కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే ఆటో నడుపుతూ అర్ధరాత్రి వరకూ కష్టపడేవాడు. నెలంతా కష్టపడితే రూ.10 వేలు వచ్చేవి. అందులో రూ.6 వేలు పిల్లల ఫీజులకు పోగా, మిగతా డబ్బులతోనే ఆ కుబుంబం నెలంతా నెట్టుకొచ్చేది.
టీచర్ కావాలనేది దేశ్రాజ్ మనవరాలి ఆశయం. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు చూసిన ఆమె చదువు మానేస్తానని తాతతో చెప్పింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయొద్దని చెప్పిన దేశ్రాజ్ ఆమె చదువు కోసం వారు ఉంటున్న ఇంటిని అమ్మేసి ఆమెను దిల్లీలోని ఓ కళాశాలలో బీఈడీ కోర్సులో చేర్పించాడు. మిగతా కుటుంబసభ్యులను ఆయన సొంతూరిలోని బంధువుల ఇంటికి పంపించాడు. దేశ్రాజ్ మాత్రం ముంబయిలోనే ఆటో నడుపుతూ అందులోనే జీవించేవాడు. ఆటోలోనే తినేవాడు. అందులోనే పడుకునేవాడు. ఈ నేపథ్యంలోనే దేశ్రాజ్ గురించి ప్రముఖ సామాజిక మాధ్యమం పేజీ హ్యూమన్స్ ఆఫ్ బాంబే చేసిన పోస్టు వైరల్గా మారింది. వృద్ధుడి దీన గాథ చదివిన నెటిజన్లు చలించిపోయారు. ఓ ఫేస్బుక్ యూజర్ ఫండ్రైజింగ్ చేపట్టగా మొత్తం రూ.24 లక్షలు సమకూరాయి. దీంతో ఆ వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. స్పందించిన దాతలందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: కొండపై బావి తవ్వి నీటి కష్టాలు తీర్చిన భగీరథుడు