Telugu Student Died in London: రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి.. లండన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం
Telugu Student Kiran Kumar Died in London: ఉన్నత విద్య కోసమని విదేశాలకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లాడు ఓ విద్యార్థి. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి గత నెల లండన్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి చివరకు ప్రాణాలు వదిలాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్.. ఏలూరులో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసి.. ఎమ్మెస్ చేయటానికి రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అక్కడే ఉంటూ ఉద్యోగ అన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఓ దొంగను పోలీసులు పట్టుకునే నేపథ్యంలో.. ఆ దొంగ కారులో పారిపోతూ కిరణ్ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కిరణ్ను రాయల్ వైద్యశాలలో చేర్పించగా.. మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన మరణించిన కిరణ్ మృతదేహం గురువారం రాత్రి స్వగ్రామానికి తీసుకురావటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.