thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 10:44 PM IST

ETV Bharat / Videos

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముందుండాలి - టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

TDP Parliamentary Party Meeting Chaired by Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంట్‌ ఉభయ సభల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో గళమెత్తేందుకు దాదాపు 13 అంశాలపై ఎంపీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాలకు తెరలేపిందనే అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు, ముఖ్యనేతలు సమన్వయం చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపదల చేయడంతో పాటు రాష్ట్రంలో ధరల స్థిరీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సక్రమ అమలు వంటి అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేలా ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేశారు. అదే విధంగా ఏపీలో పేదరికం, నిరుద్యోగం, విభజన హామీలు, మహిళల భద్రత అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు. శనివారం జరిగే అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు, లోకేశ్​లపై పెట్టిన అక్రమ కేసుల వ్యవహారాన్ని అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నేతలు యోచిస్తున్నారు. వైసీపీకి ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని టీడీపీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి టీడీపీ ఎంపీలు ఎప్పుడూ ముందుండాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.