By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 5:27 PM IST
అన్ని వర్గాలను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత సీఎం జగన్దే: కాలవ శ్రీనివాసులు
TDP Leader Kalava Srinivasulu Fires on YCP Government: రాష్ట్రంలో అన్ని వర్గాలను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు సర్వ శిక్షా అభియాన్ కార్మికులు, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని వర్గాల వారు రోడ్డు మీదకు వస్తున్నారని కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. వాళ్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యమైన విధంగా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో ఈ దుర్మార్గపు పాలన పోయి మంచి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.