By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 1:48 PM IST
బీఈడీ కౌన్సెలింగ్లో జాప్యం - హైకోర్టులో పిల్ దాఖలు
PIL Filed in High Court on Delay in BED Counselling : బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ కన్వీనర్ మోర్త రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఏపీఎడ్సెట్ కన్వీనర్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
BED Counselling in AP : 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసి, జూన్లో పరీక్ష నిర్వహించి, జులై 14న ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ప్రకటించారని అన్నారు. 10,908 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఫలితాలు వెల్లడై ఆరు నెలలు పూర్తయినా ఇప్పటివరకు కౌన్సెలింగ్ నిర్వహించలేదన్నారు. వారు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. వారందరు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకపోవడానికి గల కారణాలను సైతం అధికారులు వెల్లడించడం లేదన్నారు.
తక్షణం కౌన్సెలింగ్ను నిర్వహించాలి : ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో బీఈడీ కళాశాలలను పరిశీలించి గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఫీజు రెగ్యులేషన్ కమిటీ రుసుములను ఖరారు చేసిందని తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తక్షణం కౌన్సెలింగ్ను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.