Peddireddy Ramachandra Reddy on TDP Janasena Alliance: ఎన్ని జెండాలు కలిసొచ్చినా.. మాది ఒక్క జెండానే: పెద్దిరెడ్డి - YCP leaders comments on TDP Janasena alliance
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 6:03 PM IST
Peddireddy Ramachandra Reddy on TDP Janasena Alliance: జనసేన, టీడీపీ పొత్తు ప్రకటించడంపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్జి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని జెండాలు కలిసొచ్చినా.. తాము మాత్రం ఒక్క వైసీపీ జెండాతోనే వస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పొత్తులపై బీజేపీ స్పందించలేదేమో అందుకే పవన్ టీడీపీతో కలుస్తున్నారన్నారు. ఇదేం కొత్త విషయం కాదని.. తాము ఎప్పటి నుంచో టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయని చెబుతున్నామని గుర్తు చేశారు. మొదటి నుంచి పవన్ తెలుగుదేశంతోనే ఉన్నారన్నారు.
అనంతపురంలో సాగునీటి, వ్యవసాయ సలహా కమిటి సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి, మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించామని, అన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంపై సమీక్షించామని, తన దృష్టికి తెచ్చిన వాటిని పరిష్కరిస్తామన్నారు. సాగునీటి అవసరాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డి.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే వెళ్లి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.