By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 4:32 PM IST
ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్తే ఓటు తీసేయటం సరికాదు - నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిరసన
Nimmagadda Ramesh Kumar Rally in Duggirala: సొంతూరులో ఉండటం లేదన్న కారణంతో ఓటు హక్కు తొలగించడం అప్రజాస్వామికమని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఫాం7 ద్వారా ఓట్ల తొలగింపు నోటీసులు అందుకున్న బాధితులతో ఆయన నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మన ఓటు మన హక్కు అంటూ ఫాం-7 బాధితులు నినాదాలు చేశారు.
ప్రధాని మోదీ గాంధీ నగర్లో, ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు ఇతర పౌరులు కూడా సొంతూరులో ఓటు వేసే అవకాశం కలిగి ఉండాలన్నారు. ఓటుహక్కుకు విఘాతం కలిగించేలా ఫాం-7 దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. సొంతూరులో ఓటు వినియోగించుకోవాలని అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. దుగ్గిరాలలో 23 మంది స్థానికంగా లేరన్న కారణంతో ఓట్ల తొలగింపు నోటీసులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. గంపగుత్తగా ఫాం7 దరఖాస్తులు పెట్టే వారిపై నియంత్రణ విధించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నిమ్మగడ్డ రమేష్కుమార్ విజ్ఞప్తి చేశారు.