MP Kinjarapu Rammohan Naidu Fire on YCP: 'శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలి' - ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 2:19 PM IST
MP Kinjarapu Rammohan Naidu Fire on YCP: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు టీడీపీ సానుభూతిపరులు సైకిల్ యాత్ర చేస్తే.. పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడాన్ని ఎంపీ ఖండించారు. దీనిపై వైసీపీ మంత్రులు ఎవరూ మాట్లాడలేదన్న ఎంపీ.. మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రజలు ఇళ్లు దాటాలంటే పాస్పోర్ట్, వీసాలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని నిరూపిస్తామన్న ఎంపీ రామ్మోహన్.. చంద్రబాబు అక్రమ అరెస్టు కేసును నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ విశాఖలో పోటీ చేస్తే.. అక్కడి ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే విశాఖలో క్యాపిటల్ పెట్టనవసరం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.