By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 3:05 PM IST
మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం - రైతులకు మంత్రి కారుమూరి భరోసా
Minister karumuri Visit Michaung Cyclone Affected Areas: మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులను సైతం ముంచెత్తాయి. ముంపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తూర్పుగోదావరిలో కురిసిన కుండపోత వర్షాలకు పంట పొలాలు వర్షార్పణమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తుపాను ప్రభావిత గ్రామాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. నిడదవోలు పెరవలి మండలంలోని గ్రామాల్లో స్థానిక శాసనసభ్యుడు శ్రీనివాస్ నాయుడుతో కలిసి పంట నష్టాలు పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మొలకలు వచ్చిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
"పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొలకలు వచ్చిన ధాన్యంలో మొలకలను వేరుచేసి ధాన్యం కొనుగోలుతో పాటు మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం. పంట నష్టపోయిన, ధాన్యం తడిసిపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్లు వర్తించేలా అధికారులతో నమోదు చేయిస్తాం" - కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి