K Ramakrishna Fires on CM Jagan in CPI Bus Yathra: 'ప్రజాస్వామ్యాన్ని వైసీపీ పాతిపెట్టింది.. పోలీస్ ద్వారా అధికారాన్ని చలాయించడం సిగ్గుచేటు' - CPI State Secretary Ramakrishna
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 7:43 PM IST
K Ramakrishna Fires on CM Jagan in CPI Bus Yathra: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూర్ఖత్వపు చర్యల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. 'రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మచిలీపట్నం చేరుకున్న సందర్భంగా పలువురు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా అధ్యక్షురాలు అక్కినేని వనజ అధ్యక్షతన రాజ్యాంగ హక్కులు - పరిరక్షణకై.. అన్న అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పక్షాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే డా. బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కనుమరుగు చేస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పాతిపెట్టిందని అన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి పోలీస్ ద్వారా అధికారాన్ని చలాయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమస్యలపై పోరాటం చేయకుండా ప్రజా సంఘాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ఎక్కడికక్కడ గృహనిర్భంధాలు చేస్తున్నారని, చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఆయన జిల్లాలో తిరగనీయకుండా అడ్డుకోవడం అమానుషమన్నారు. ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టే నీచస్థితికి దిగజారారని విమర్శించారు. అప్రజాస్వామిక చర్యలకు తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.