'సాగునీటి కొరత, విద్యుత్ కోతలు - వ్యవసాయం పచ్చగా ఉందని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదం' - ANDHRA PRADESH POLITICAL NEWS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 2:58 PM IST
CPM leaders fire on power cuts : సీపీఎం పార్టీ చేపట్టిన ప్రజా రక్షణ భేరీ యాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ రాష్ట్రంలో వ్యవసాయం పచ్చగా ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని శ్రీనివాసరావు అన్నారు. ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరు ఉండాలని పట్టుపడుతున్నాయన్నారు. విద్యుత్ కోతల వల్ల నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా.. సాగునీటి కోసం వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గమైన చింతలపూడి లో బస్సు డిపో లేకపోవడం బాధాకరమన్నారు. చింతలపూడి నుంచి అమరావతికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
విశాఖ ప్రజలు రాజధానిని ఇక్కడకు తీసుకురావడం కంటే విశాఖ స్టీల్ ప్లాంటు పరిరక్షణే కోరుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వాసులు రాజధాని ఇక్కడికి రావద్దు బాబోయ్ అంటూ దండం పెడుతున్నారని.. రాజధాని విశాఖకు వెళ్లినా ప్రజలకు ఉపయోగం లేదని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమం కోసం కాకుండా.. అవినీతికి పాల్పడటం, దోచుకోవడం, దాచుకోవడం పైనే దృష్టిపెట్టాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి, హామీల గురించి కాకుండా.. సనాతన ధర్మం, అయోధ్య రామాలయం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన మోదీకి టీడీపీ, టీడీపీ, జనసేన ఊడిగం చేయడం హాస్యాస్పదమన్నారు.