By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 7:10 PM IST
రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Congress Ex MP Lagadapati Rajagopal Comments: రాజకీయాల్లోకి తిరిగి రావాలనే ఆలోచనే తనకు లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీలు హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్లతో ఆయన భేటీ అయ్యారు. హర్షకుమార్, ఉండవల్లి నివాసాలకు ఆయన వెళ్లి కలిశారు. మాజీ ఎంపీ లగడపాటి హర్షకుమార్తో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్, ఉండవల్లిని కలిసినట్లుగా లగడపాటి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉండవల్లి, హర్షకుమార్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరఫున ప్రచారం చేస్తానన్నారు.
"కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉండగా దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్, ఉండవల్లిని కలిశాను. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. రాబోయే ఎన్నికల్లో ఉండవల్లి, హర్షకుమార్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరఫున ప్రచారం చేస్తాను. ప్రజల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ను విడిచిపెట్టాం. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మేం పూర్తిగా విభేదించాం. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషకరం." - లగడపాటి రాజగోపాల్, మాజీ ఎంపీ