By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 6:12 PM IST
'పెళ్లైన ఐదు రోజులకే' తిరుపతి దర్శనానికి వెళ్లిన దంపతులు - ఊహించని విషాదం
Bride Died Five Days After the Wedding : కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతితో పెండ్లి ఇంట విషాదం నెలకొంది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన కొప్పురావురి రమేశ్ కుమారై లక్ష్మి సంతోషికి ఈ నెల 23న (నవంబరు 23న) వివాహం జరిగింది. నవంబరు 28న నూతన దంపతులు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో లక్ష్మి సంతోషి ఊపిరాడక ఇబ్బంది పడింది.
స్వామి దర్శనం అనంతరం బయటకు రాగానే ఒకసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను తిరుమలలోని అశ్విని వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య మరణవార్తతో భర్త భార్గవ్తో పాటు ఆమె చెల్లెలు కుప్పకూలిపోయింది. వారి ఇద్దరికి అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. పెళ్లైన ఐదురోజులకే వధువు అకస్మాత్తుగా మృతిచెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లవలసిన తన కుమారైను.. విగత జీవిగా చూసి ఆమె తల్లిదండ్రులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు.