YCP leaders Illegal soil mafia: అనుమతులు లేకుండానే వైసీపీ నాయకుల మట్టి తరలింపు.. అడ్డుపడిన అధికారులు
YSR Congress Party Leaders Illegal soil mafia news: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన నాయకులు పార్టీ అండదండలను చూసుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తెచ్చుకోకుండానే ఇష్టారీతిగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో నాయకుల అక్రమాలపై స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం బైరవాని చెరువులో అనుమతులు లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి తవ్వకాలను జరిపారు. చెరువులో ఇష్టారాజ్యంగా నాయకులు మట్టి ఇవ్వకాలు జరుపుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. గమనించిన స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి ఆధారాల సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకుని.. మట్టి తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపాలని అడిగారు. అనుమతులకు దరఖాస్తు చేసుకున్నామంటూ సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో అధికారులు వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలను, మట్టి తరలింపును తాత్కాలికంగా నిలుపుదల చేశారు. బైరవాని చెరువులో మూడు పొక్లెయిన్లు, 80 ట్రాక్టర్లు, టిప్పర్లతో చెరువును గుల్ల చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.