కడప నగరంలో వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అమలు చేయని రెండు ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున హెచ్చరించారు. నగరంలోని హోలిస్టిక్, కొమ్మా ప్రైవేటు ఆసుపత్రులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోలిస్టిక్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరిన న్యూరోసర్జరీ విభాగంలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సీఈవో గమనించారు. ఆరోగ్యశ్రీ రోగులకు సరైన వసతులు కల్పించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగాన్ని ఆరోగ్యశ్రీ నుంచి రెండు, మూడు రోజుల్లో తొలగిస్తామని ఆయన తెలిపారు. వీటితోపాటు కొమ్మా ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన... ఆరోగ్యశ్రీ రోగుల నుంచి పరీక్షలు, మందుల కోసం డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రికి రెండురోజుల్లో నోటీసు పంపించి వివరణ కోరుతామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవీ చదవండి