GV Anjaneyulu Comments on YS Jagan : ప్రజాసమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. శాసనసభా నియమావళి, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్కు రాననడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడూ పనిచేయలేదన్న ఆయన, సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా ఆత్మాభిమానం లేకుండా జగన్ (Jagan) ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చుని ప్రశ్నలు అడుగుతానంటే కుదరదని ధ్వజమెత్తారు. ప్రజలు తనకు ఆ మాత్రం 11సీట్లు కూడా ఇచ్చింది అసెంబ్లీలో గళమెత్తమనటానికే అనే విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు ప్రతిపక్షహోదా ఇవ్వనందున ఆ పాత్ర కూడా తామే పోషించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా తాము ప్రజలకే జవాబుదారీగా ఉంటామని జీవి ఆంజనేయులు వెల్లడించారు.
జగన్ మానసిక స్థితి సరిగా లేదు - సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులిస్తాం: మంత్రి సంధ్యారాణి
జగన్ అసెంబ్లీకి వచ్చి తాను అడగాల్సింది అడిగితే ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధమని అన్నారు. పవిత్రమైన సభను కాదని చట్ట సభల గౌరవాన్ని కించపరుస్తూ, ప్యాలెస్లో కూర్చుని ప్రశ్నలు అడుగుతానననటం జగన్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. టీడీఎల్పీలో చీఫ్ విప్లు జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) ఆధ్వర్యంలో విప్ల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు హాజరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యతలపై వివరించారు. తమ పరిధిలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల ఎమ్మెల్యేల హాజరుపై ప్రతీ విప్ బాధ్యత తీసుకోవాలన్న సీఎం ఆదేశాలపై వారంతా చర్చించారు. సభలో ఏయే ఎమ్మెల్యేతో ఏ అంశం మాట్లాడించాలి, సబ్జెక్ట్ల విభజన తదితర అంశాలపై మాట్లాడారు. ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించే ఎమ్మెల్యేల (MLA) అవగాహన కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించారు.
విధ్వంసం చేసిన వ్యక్తే దాని గురించి మాట్లాడటం విడ్డూరం: నిమ్మల