కడప జిల్లాలోని ఓ పురాతనమైన ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నందలూరు మండలంలోని కుంపినీపురం గ్రామంలో పూర్ణప్రజ్ఞ అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఇంట్లో కొన్ని పురాతన వస్తువులు కూడా లభ్యమయ్యాయి.
ఆరుగురు సభ్యుల ముఠా వస్తువులను తీసుకుని కారులో వెళ్తుండగా అరెస్ట్ చేశామని పోలీసు అధికారి (ఓఎస్డీ) దేవప్రసాద్ మీడియాకు వెల్లడించారు. నిందితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన పూర్ణప్రజ్ఞ, సోంపల్లి శేషాద్రి, చంద్రగిరి జగదీష్, జ్ఞానేంద్ర నాయుడు, కర్ణ హరినాథ్తో పాటు నందలూరు మండలానికి చెందిన గుడిశె సునీల్ ఉన్నట్లు తెలిపారు.
గుప్తనిధుల తవ్వకాల కోసం ఉపయోగించిన కారు, గడ్డపార, టేపు, ఆరు డ్రోసింగ్ రాడ్లు, నాలుగు తెల్ల రాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం.. పూజలు చేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారని ఓఎస్డీ దేవప్రసాద్ తెలిపారు. ఆలయాలపై ఇటీవల జరుగుతున్న దాడుల కారణంగా తనిఖీలు ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు