దేశభాషలందు తెలుగు లెస్స అని గొప్పగా చెప్పుకునే మన మాతృభాష పుట్టుక, పరిణామ క్రమాన్ని తెలియజేసే... మరో అరుదైన శాసనం కడప జిల్లాలో లభ్యమైంది. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం సమీపంలోని పొలంలో ఈ శాసనాన్ని గుర్తించారు. 8వ శతాబ్ధానికి చెందిన చోళరాజుల వంశీయుడైన చోళ మహారాజు ఈ రాతి శాసనాన్ని వేయించినట్లు గుర్తించారు. చిన దుద్యాలలో ఉన్న శాసనాన్ని కడప యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర - పురావస్తు విభాగం సహాయ ఆచార్యులు రామబ్రహ్మం... పీజీ విద్యార్థి వాసుదేవరెడ్డి గుర్తించారు. తెలుగు అక్షర క్రమాలను పోలివున్న శాసనం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునేందుకు మైసూరులో ఉన్న భారత పురావస్తుశాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. వారు అధ్యయనం చేసి చోళరాజుల కాలం నాటిదిగా గుర్తించారు. 6 నుంచి 9వ శతాబ్దం మధ్యలో తెలుగు భాష పరిణామక్రమం చెందిందని, అదే కాలానికి చెందిన రేనాటి చోళ మహారాజు ఈ శాసనాన్ని వేశారని తేల్చారు.
"కాపాడితే పుణ్యం.. నాశనం చేస్తే పాపం"
చోళ మహారాజు.... పిడుగుల గ్రామానికి చెందిన సిద్ధమయ్య అనే బ్రాహ్మణుడికి ఆరు మర్తుల భూమిని దానంగా ఇచ్చినట్లు శాసనంలో పేర్కొన్నారు. 24 వరసల్లో అక్షరాలు ఉండగా... ఓ వరుస పూర్తిగా పాడైపోయింది. అందులో లిపిని ఆర్కిక్ తెలుగుగా గుర్తించారు. 21 నుంచి 24 వరుసల్లో పాపపుణ్యాల గురించి రేనాటి చోళరాజులు రాసినట్లు పురవాస్తుశాఖ అంచనా వేసింది. "ఈ శాసనాన్ని కాపాడిన వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుంది... నాశనం చేసిన వారికి వారణాసిలో చంపినంత పాపం వస్తుంది" అని రాసినట్లు గుర్తించారు.
కడప జిల్లాలోనే ఎక్కువగా...
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలను రేనాటి రాజులు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. రేనాడు, ములికినాడు, కొత్తపినాడు, పాకనాడు వంటి ప్రాంతాలు గతంలో ఉండేవి. ఈ ప్రాంతాన్ని పాలించిన చోళరాజులు వేసిన ఈ రాతి శాసనం ద్వారా... అప్పటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, భూదానం, పాపపుణ్యాల ప్రస్తావన వంటి విషయాలు అధ్యయనం చేయొచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో చినదుద్యాలకు 16 కిలోమీటర్ల దూరంలోని కలమల గ్రామంలోనే తొలి తెలుగు కలమల శాసనం లభించటం విశేషం. 6వ శతాబ్దంలో రేనాటి ధనుంజయ మహారాజు దాన్ని వేసినట్లుగా గుర్తించారు. తెలుగు పరిణామ క్రమం జరిగిన కాలానికి చెందిన శాసనాలు... కడప జిల్లాలోనే ఎక్కువగా బయటపడుతున్న పరిస్థితుల్లో.. ఈ ప్రాంతంలోనే భాషాభివృద్ధి చెంది ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 11వ శతాబ్దం నుంచి తెలుగు భాష పూర్తిగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు.
మైలవరం వద్దనున్న పురావస్తుశాఖ మ్యూజియంలో రేనాటి రాజులకాలంనాటి శాసనాన్ని భద్రపరిచారు. కడప జిల్లాలో శాసనాలు గుర్తించి పరిశోధనలు చేసే ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతూ.. దిల్లీలోని యూజీసీకి యోగి వేమన విశ్వవిద్యాలయం పురావస్తు విభాగం ప్రతిపాదనలు పంపించింది.
ఇదీ చూడండి: